
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆరుగాలం కష్టపడి పంటలు పండించిన రైతులకు దాన్యపు విక్రయించుకునే సమయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆరోపించారు.


రైతుల పంటలు, వరి కోతలు పూర్తి కాక పోవడంతో రైతులకు రావడం ఇబ్బంది అవుతుందని భావించి వివిధ సామాజిక వర్గాలు, విద్యార్థుల విన్నపం మేరకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 28న కరీంనగర్ లో నిర్వహించనున్న రైతుల మహాగర్జన సమరభేరి సభను మే 30వ తేదీకి మార్చినట్లు పోలాడి రామారావు తెలిపారు. మే 30న రెండు లక్షల మందితో రైతుల మహాగర్జన సమరభేరి సభను నిర్వహిస్తామన్నారు. ఆదివారం హుజురాబాద్ మండలంలోని పెద్దపాపయ్యపల్లి, చెల్పూర్, శాలపల్లి,రాంపూర్, జూపాక,కందుగుల బోర్నపల్లి గ్రామాల్లో రామారావు పర్యటించి రైతుల తో సమావేశం అయ్యి దాన్యపు విక్రయాల లో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ
దాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించటం తప్ప, కొనుగోళ్లు జరపడం లేదన్నారు. దీంతో అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
కనీసం వారికి టార్పాలీన్ షీట్ కవర్లు,గన్నీ బ్యాగులు సరఫరా చేయడం లేదని దీంతో ప్రైవేట్ దళారులకు రైతులు తక్కువ ధరకు దాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి దాపురించిందని ఇందుకు ప్రభుత్వ పెద్దలు ప్రైవేట్ వ్యక్తిల మధ్య కుదిరిన బేర సారాల లోపాయికారీ ఒప్పందమేనని అన్నారు.క్వింటాల్ కు తాలు మట్టి లేని ఆరబెట్టి ఎండిన సూకా దాన్యానికి ఆరు కిలోల దాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని ఆయన మండి పడ్డారు. ఇప్పటికే 60 శాతం దాన్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందన్నారు. అలాగే 500 రూపాయల బోనస్ డబ్బులు ఎగొట్టేందుకు, కావాలనే ప్రైవేట్ వాళ్లకు
లబ్ది చేసేందుకే ఆలస్యంగా దాన్యపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి దాన్యపు కొనుగోళ్లు జరపడం లేదన్నారు.దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా నిధులను ఎగొట్టిన ప్రభుత్వం,సాగు సమయంలో ఇవ్వాల్సిన రైతు భరోసా నిధులను ఇప్పుడు పంటల కోత సమయంలో అర కొరగా విడతల వారీగా ఇవ్వడం దారుణమన్నారు.ఈ కార్యక్రమంలో కొండాల్ రెడ్డి మూగల శ్రీధర్ రెడ్డి, శ్రావణ్, సమ్మీరెడ్డి సుధాకర రెడ్డి, లక్ష్మా రెడ్డి, మహేందర్, రమేష్ తదిరులు ఉన్నారు

పెద్ద పాపయ్యపల్లిలో రైతులతో మాట్లాడుతున్న రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు





