
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 27: రాష్ట్ర ఎరువుల డీలర్ల యూనియన్ పిలుపు మేరకు ఈరోజు హుజురాబాద్ మండలంలో ఎరువుల దుకాణాల బంద్ సంపూర్ణంగా జరిగింది. ఎరువుల వ్యాపారులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం మరియు ప్రభుత్వం, కంపెనీల మొండి వైఖరిని నిరసిస్తూ డీలర్లందరూ స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన డిమాండ్లు: 1) FO (Freight Outward) సమస్య: యూరియా మరియు ఇతర ఎరువుల రవాణా ఖర్చులను (FO) కంపెనీలే భరించాలి. ప్రస్తుతం డీలర్లపై పడుతున్న ఈ భారం వల్ల వ్యాపారం నష్టాల్లో సాగుతోంది. 2. డీలర్ మార్జిన్ పెంపు: పెరుగుతున్న నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా ఎరువులపై డీలర్లకు ఇచ్చే కమీషన్ (Margin)ను వెంటనే పెంచాలి. 3. లింక్ ప్రొడక్ట్స్ నిలిపివేత: ప్రధాన ఎరువులైన యూరియా, DAPతో పాటు అనవసరమైన ఇతర ఉత్పత్తులను (Link Products) బలవంతంగా డీలర్లకు అంటగట్టే విధానాన్ని కంపెనీలు తక్షణమే నిలిపివేయాలి. 4. వ్యాపార హక్కుల రక్షణ: నిబంధనల పేరుతో డీలర్లపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలి. యూనియన్ నాయకుల ప్రకటన:”ఏళ్ల తరబడి ఎరువుల మార్జిన్ పెంచకపోవడం, పక్కాగా FO చెల్లించకపోవడంతో డీలర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు తమ లాభాల కోసం లింక్ ప్రొడక్ట్స్ ఇస్తూ డీలర్లను ఆర్థికంగా కృంగదీస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. “ఈ కార్యక్రమంలో హుజురాబాద్ మండల ఎరువుల డీలర్స్ పాల్గొన్నారు.

హుజురాబాద్ మండలంలో సంపూర్ణ బంద్ పాటిస్తున్న ఫర్టిలైజర్స్ షాపులు..






