
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ సబ్డివిజన్ పరిధిలో విద్యుత్ భద్రతాపై అవగాహన సమావేశం నిర్వహించారు. విద్యుత్ భద్రతా వారోత్సవాలు సందర్భంగా హుజూరాబాద్ సబ్డివిజన్ పరిధిలో O&M సిబ్బంది మరియు వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సమావేశం, హుజూరాబాద్ KC క్యాంపులోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, భద్రతా నియమాలు, సరైన విధానాల గురించి విస్తృతంగా వివరించారు. ముఖ్యంగా లైన్ క్లియరెన్స్ (LC), పర్మిట్ టు వర్క్ (PTW), వ్యక్తిగత రక్షణ పరికరాల (PPE) వినియోగం, సరైన ఎర్తింగ్, ఫీడర్ ఐసోలేషన్ వంటి అంశాలపై O&M సిబ్బందికి సూచనలు ఇచ్చారు. అలాగే వినియోగదారులకు ఇంటి వైరింగ్ సురక్షితంగా ఉండేలా చూసుకోవడం, తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకకపోవడం, కిందకు వాలిన తీగలకు దగ్గరగా వెళ్లకపోవడం వంటి భద్రతా సూచనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో O&M సిబ్బంది, వినియోగదారులు, AEలు మరియు ADE హుజూరాబాద్ శ్రీనివాస్, డివిజనల్ ఇంజినీర్ ఎస్. లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డివిజనల్ ఇంజినీర్ ఎస్ లక్ష్మారెడ్డి

విద్యుత్ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రూపొందించిన వాల్ పోస్టర్ లను ఆవిష్కరిస్తున్న అధికారులు, సిబ్బంది..





