
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లావ్యాప్తంగా మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతాంగం అధిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతలు అరిగోసలు పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం హుజురాబాద్ లో సిపిఎం కార్యకర్తల సమావేశం జరిగింది.


మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిల్లాలో అన్నదాతలు కొనుగోలు కేంద్రాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాల్సిన కిందిస్థాయి అధికారులే మామూళ్ల కు కక్కుర్తి పడి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. తేమా, తాలు పేరుతో క్వింటాల్ ధాన్యానికి 5 నుండి 8 కిలోలు కోత విధిస్తున్నారని, ఏ గ్రేడ్ ధాన్యాన్ని కామన్ గ్రేడ్ కింద రైస్ మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి అని అన్నారు .కొనుగోలు సెంటర్లలో కనీస సౌకర్యాలైన మంచినీరు, టార్పాలిల్లు, టెంట్లు, వాష్ రూమ్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లారీల కొరతను పరిష్కరించాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ఆలస్యం చేయొద్దు అన్నారు. అన్ని రకాల పంటలకు క్వింటాల్కు 500 బోనస్ వెంటనే రైతులు అకౌంట్లో జమ చేయాలని, రైతు భరోసా నిధులు జమ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులు యాసంగి ప్రారంభంలో ఇవ్వాల్సిన డబ్బులు యాసంగి పూర్తయినప్పటికీ రైతులు అకౌంట్లో జమ చేయకపోవడం రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతుందన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఈనెల 11న ధర్నా ఉంటుందని, ధర్నాను జయప్రదం చేయాలన్నారు. మండల కేంద్రంలో నిర్మించిన 500రెండు పడక గదుల ఇళ్ళను లబ్ధిదారులకు వెంటనే పంపిణీ చేయాలన్నారు. సంవత్సరాలు గడుస్తున్న ఎవరికి ఇండ్లను కేటాయించకపోవడం మూలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా తయారయ్యాయన్నారు. నెల రోజుల్లో అర్హులైన పేదలను గుర్తించి, రాజకీయాలకు అతీతంగా రెండు పడక గదుల ఇళ్లను కేటాయించాలని లేనియెడల అర్హులైన లబ్ధిదారులతో ఇండ్లను స్వాధీనం చేసుకొని పేదలు నివాసం ఉంటారని అన్నారు. హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రభుత్వం అనుమతి లేని ప్రైవేటు ఆసుపత్రులను మూసివేయాలని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. నీటి ఎద్దడి నివారణ కు అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకోవాలని, ఎక్కడికి అక్కడ చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నాయకులు చంద్రయ్య, కొప్పుల శంకర్, ప్రతాప శ్రీనివాస్, చంద్రయ్య, ఉమ్మడి దేవేందర్, బోరగాల కుమార్, ఇమ్మడి శ్రీకాంత్, రాచపల్లి సారయ్య తదితరులు పాల్గొన్నారు.





