
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(ఎల్కతుర్తి): మొక్క జొన్న, వరి దాన్యం కొనుగోలు సెంటర్లలో దాన్యం తరలింపు, కొనుగోళ్లలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆగం అయి అరిగోస పడుతున్నారని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు విమర్శించారు. డిమాండ్ల సాధనకు ఈనెల 30న కరీంనగర్ లో నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభ విజయవంతనికి సోమవారం ఎల్కతుర్తిలో రైతు ప్రజా సంఘాల నాయకుల తో సమావేశం నిర్వహించి సమీక్షించి గోడ ప్రతులను ఆవిష్కరించారు.

రాష్ట్రస్థాయి రైతు మహాగర్జస సమర భేరి సభకు సంబంధించిన వాల్ పోస్టులను ఆవిష్కరించి మాట్లాడుతున్న పోలాడి రామారావు.

ఈ సందర్బంగా పోలాడి రామారావు మాట్లాడుతూ పంటల కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా నేటికీ సక్రమంగా కొనుగోళ్లు జరగడం లేదన్నారు. మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ను ఎగొట్టేందుకే కొనుగోళ్లలో పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తూ కమిషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేస్తున్నారని పోలాడి రామారావు ఆరోపించారు. కొనుగోలు కేంద్రంలో అన్నదాతల సమస్యలు పరిష్కరించాల్సిన కింది స్థాయి అధికారులే మామూళ్లకు కక్కుర్తి పడి రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారన్నారు. తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు 5 నుండి 8 కిలోలు కోత విధిస్తున్నారని ఏ గ్రేడ్ దాన్యాన్ని కామన్ గ్రేడ్ క్రింద రైస్ మిల్లర్లు దిగుమతి చేసుకుంటున్నా అధికారులు తమ కేమి పట్టనట్లు వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి అని అన్నారు. రైతులు దాన్యాన్ని ఆర బెడుతూ వడ దెబ్బకు మృత్యు వాత పడుతుందటం దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. కొనుగోలు సెంటర్లలో లారీలు,, హమాళీలు, గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. మిల్లుల వద్ద దాన్యం దిగుమతి ఆలస్యం చేయొద్దని అన్నారు.అన్ని రకాల పంటలకు 500 రూ. బోనస్ ను వెంటనే రైతుల అకౌంట్లలో జమ చేయాలన్నారు. రైతు భరోసా నిధులు విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. పెట్టుబడి సాయం కింద అందించే రైతు భరోసా నిధులు యాసంగి ప్రారంభంలో ఇవ్వాల్సిన డబ్బులు యాసంగి పూర్తయినప్పటికి రైతుల అకౌంట్లలో జమ చేయక పోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్త శుద్ధి ఏపాటిదో అవగత మవుతుందన్నారు. అన్నదాతలకు ఇఛ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న కరీంనగర్ లో రెండు లక్షల మందితో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జస సమర భేరి సభను నిర్వహించనున్నట్లు పోలాడి రామారావు తెలిపారు. ఈ సమావేశంలో రైతు ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, నాయకులు చందుపట్ల నర్సింహారెడ్డి, తాటిపల్లి రాజన్న, అశోక్, రాజిరెడ్డి, రామిరెడ్డి, సమ్మిరెడ్డి, సుధాకర్, రాజేశ్వర్రావు, భీంరెడ్డి, జోగిరెడ్డి, సదానందం తదితరులు పాల్గొన్నారు.





