
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల నేల సారం దెబ్బతినడంతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) జి.సునీత పేర్కొన్నారు. గురువారం హుజురాబాద్ ఇప్పల్ నర్సింగాపూర్ గ్రామ శివారులో రైతు గూడూరి స్వామిరెడ్డి తన పొలంలో రోటరీ మల్చర్ సహాయంతో పంట అవశేషాలను భూమిలో కలియదున్నారు. ఈ కార్యక్రమాన్ని ఏడీఏ పరిశీలించి, రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంట అవశేషాలను భూమిలో కలియదున్నడం వల్ల అవి కుళ్లి హ్యూమస్గా మారి సేంద్రియ కార్బన్, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలు తిరిగి నేలకు చేరుతాయన్నారు. దీనివల్ల నేల లూజై గాలి ప్రసరణ పెరగడమే కాకుండా, తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అవశేషాలను కాల్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. మంటల వేడికి నేలలోని మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని, పోషకాలు పొగ రూపంలో వాతావరణంలో కలిసిపోతాయని హెచ్చరించారు. పొగ వల్ల శ్వాసకోశ, కంటి సమస్యలు వస్తాయని, ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కాబట్టి రైతులెవరూ పంట వ్యర్థాలను కాల్చవద్దని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) నిఖిల్ కుమార్, రైతులు గూడూరు స్వామిరెడ్డి, దండ వెంకటరమణారెడ్డి, గూడూరి మల్లారెడ్డి, బండి సమ్మయ్య, గూడూరి చైతన్యరెడ్డి, అరె రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏడిఏ సునీత

పంట అవశేషాలను భూమిలో కలియదున్నుతున్న రైతు స్వామిరెడ్డి





