
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా హుజూరాబాద్ మండల వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు గురువారం విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మండల పరిధిలోని అంబేద్కర్ నగర్, చిన్న పాపయ్యపల్లి, బొత్తలపల్లి, ధర్మరాజుపల్లి మరియు చెల్పూర్ గ్రామాలలో ఈ సభలు జరిగాయి. గ్రామాల్లోని స్థానిక సమస్యల త్వరితగతిన పరిష్కారం, మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా ఈ సమావేశాలు సాగాయి.

సమస్యల పరిష్కారమే ధ్యేయం
– ఆర్డీఓ రమేష్ కుమార్.
చిన్న పాపయ్యపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభకు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) రమేష్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన 99 రోజుల ప్రణాళికను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేసి, గ్రామాలను ప్రగతిపథంలో నడిపించడమే ఈ సభల ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ప్రాధాన్యతా క్రమంలో త్వరితగతిన పరిష్కరించాలని స్థానిక అధికారులను ఆదేశించారు.
ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యం..
ఈ సభల్లో గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తమ గ్రామాల పరిధిలోని తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం మరియు వీధి దీపాల వంటి పలు కీలక సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. అనంతరం ఎంపీడీఓ సునీత మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రగతి ప్రణాళిక పనులు నిరంతరం కొనసాగుతాయని పేర్కొన్నారు.





