
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్ : పట్టణ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఆర్డీవో రమేష్ బాబు పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు.

ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రజలు తమ వార్డుల్లోని సమస్యలను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకురావాలని, సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా దరఖాస్తులు అందించాలని సూచించారు.

మున్సిపల్ చైర్పర్సన్ సుహాసిని మాట్లాడుతూ.. వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, పరిష్కరించడానికి ఈ సభలు దోహదపడతాయన్నారు. అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఫిర్యాదులను స్వీకరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కిషన్, ఏఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు.










