
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జిల్లాలో మాదకద్రవ్యాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సిపి గౌస్ అలo తెలిపారు. మంగళవారం హుజూరాబాద్ ఏసీబీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. హుజురాబాద్ ఏసిపి కార్యాలయానికి సిపి విచ్చేసిన సందర్భంగా సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా ఆయన కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్ కేసుల గురించి ఏసీపీ వాసంశెట్టి మాధవిని అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణ బాగుందని కితాబు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
జూన్ 15లోగా సీసీటీఎన్ఎస్ 2.0, ‘ఈ-సాక్ష్య’లో వివరాల నమోదు పూర్తి కావాలని అన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు పోలీసింగ్లో సాంకేతికతను విరివిగా ఉపయోగించాలని అన్నారు. ప్రివెంటివ్ పోలీసింగ్, సీసీటీఎన్ఎస్ 2.0, ‘ఈ-సాక్ష్య’ యాప్లలో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలను జూన్ 15 లోగా తప్పనిసరిగా పొందుపరచాలన్నారు. పాత పెండింగ్ కేసుల వివరాలతో పాటు, కొత్తగా నమోదయ్యే కేసుల డేటాను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని, కేసుల ఆధారాల సేకరణలో ‘ఈ-సాక్ష్య’ను సమర్థవంతంగా వినియోగించాలని ఆదేశించారు.
గత నెలలో కరీంనగర్ పట్టణంలోని పీఎంజే నగల షోరూంలో జరిగిన దారిదోపిడీ ఘటనను దృష్టిలో ఉంచుకుని కమిషనరేట్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. జిల్లా మండల స్థాయిల్లోని నగల దుకాణాలు, బ్యాంకులు, లాడ్జీలు, హోటళ్లలో భద్రతా ప్రమాణాలను సమీక్షించి, సీసీ కెమెరాల ఏర్పాటుపై స్పష్టమైన నిబంధనలు జారీ చేశామని తెలిపారు. భద్రతా లోపాలు ఉన్న యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. నేపాలీలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికులు, ఇతర వ్యక్తుల పూర్తి వివరాలతో కూడిన రికార్డులను కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయని అన్నారు.
బేసిక్ పోలీసింగ్లో భాగంగా అనుమానాస్పద ప్రాంతాలు, రైల్వే స్టేషన్లు, హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు, వాహన తనిఖీలు ముమ్మరం చేశామన్నారు. పాత నేరస్థులపై నిరంతర నిఘా ఉంటుందన్నారు.
డ్రగ్స్ నిర్మూలనకై నార్కోటిక్స్లో శిక్షణ పొందిన ప్రత్యేక పోలీస్ డాగ్స్ (జాగిలాలు) సహాయంతో పాన్ షాపులు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాలను తనిఖీ చేస్తున్నామన్నారు. డ్రగ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయని, అనుమానితులకు పరీక్షలు నిర్వహించి పట్టుబడితే ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కఠిన కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ‘షీ లీడ్స్’, ‘స్నేహిత’ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. అలాగే నిరుపయోగంగా ఉన్న సీసీ కెమెరాలకు తక్షణమే మరమ్మతులు చేయించి పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.
తనిఖీల్లో భాగంగా హుజురాబాద్ సబ్ డివిజన్ పోలీసుల పనితీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఈ తనిఖీలో హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి, ఇన్స్పెక్టర్లు కరుణాకర్, రామకృష్ణ, వెంకట్, శ్రీనివాస్, ఎస్సైలు స్వాతి, ఆవుల తిరుపతి , పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సిపి గౌస్ ఆలం, పక్కన ఏసిపి మాధవి.





