
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వంపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు విశ్వాసం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నాయకత్వం, బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమ విధానాల పట్ల ఆకర్షితులై రాజపల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాజపల్లి గ్రామ సర్పంచ్ కటుకూరి మల్లారెడ్డి, జూపాక సింగిల్ విండో చైర్మన్ అలుమల్ల శ్యాంసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ ఉప సర్పంచ్ శనిగరం అయిలయ్య, వార్డు సభ్యులు ఈర్ల రాజు (బీజేపీ బూత్ అధ్యక్షుడు), ఈర్ల ప్రవీణ్, మునిగాల పోచయ్య, శనిగరపు సమ్మయ్య, నోముల కరుణాకర్, పత్తి శ్రీనివాస్ రెడ్డి, శనిగరపు రవి, కాంగ్రెస్ పార్టీ బూత్ అధ్యక్షుడు ఎండి రమీజ్, రాజపల్లి సోషల్ మీడియా కాంగ్రెస్ ఇంచార్జ్ చెవుల సాయికుమార్ తదితరులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి గ్రామ గ్రామాన విశేష ఆదరణ లభిస్తోందని అన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తోందని, హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మరింత శక్తివంతంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. పార్టీలో చేరిన నాయకులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే, వారి చేరికతో రాజపల్లి గ్రామంలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని, గ్రామ అభివృద్ధి మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






