
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని గుండ్ల చెరువు మత్తడి ఎత్తు ఎక్కువగా ఉండడంతో రైతుల పొలాలు ముంపు బారిన పడుతున్నాయని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన హుజురాబాద్ పట్టణ శివారులోని గుండ్ల చెరువును ఆయన సందర్శించారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ… ఎత్తు ఎక్కువగా ఉండటంతో ప్రతి వర్షాకాలంలో బ్యాక్వాటర్ ప్రభావం కారణంగా పట్టణంలోని పోచమ్మవాడతో పాటు పలు కాలనీలు నీట మునిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, అలాగే చెరువు వెనుక భాగంలో ఉన్న సుమారు 100 మంది రైతుల వ్యవసాయ భూములు కూడా నీట మునిగి తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతూ రైతులు, కాలనీవాసులు ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇరిగేషన్ శాఖ ఈఈ, డీఈ లకు ఫోన్ చేసి ప్రత్యక్షంగా చెరువును పరిశీలించి సమస్యపై మాట్లాడాలన్నారు. వెంటనే వారు చెరువు ప్రాంతానికి వచ్చి పరిశీలించారు. రైతుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.హుజూరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలోబి ఆర్ ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.


ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేస్తున్న రైతులు..





