
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 17: హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్య అయిన మురుగునీటి శుద్ధీకరణకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిరంతర కృషి ఫలితంగా స్వచ్ఛ భారత్ మిషన్ (SBM 2.0) కింద హుజూరాబాద్ మరియు జమ్మికుంట మున్సిపాలిటీలకు సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (STPs) మంజూరయ్యాయి.

ప్రభుత్వం విడుదల చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 6 MLD సామర్థ్యంతో రెండు STPలు, జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో 5 MLD సామర్థ్యంతో ఒక STP ఏర్పాటు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులు పూర్తయితే మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు పట్టణాల పరిశుభ్రత, ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగనుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక సదుపాయాన్ని తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నానని తెలిపారు. పనులు త్వరితగతిన ప్రారంభమై పూర్తయ్యేలా ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామని పేర్కొన్నారు. హుజూరాబాద్, జమ్మికుంట పట్టణాల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టులు మైలురాయిగా నిలుస్తాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





