
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : వర్షాకాలంలో జరిగే విద్యుత్ ప్రమాదాలపై ప్రజలకు అవగాహన సదస్సు మంగళవారం ప్రజాబాట కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ డీఈ (టెక్నికల్ , సేఫ్టీ) ఉపేందర్ మాట్లాడుతూ..విద్యుత్ భద్రతపై వినియోగదారులు, వ్యవసాయదారులకు విస్తృత అవగాహన ఉండాలన్నారు. విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రతి ఉద్యోగి ‘వన్ మినిట్ సేఫ్టీ’ సూత్రాన్ని తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రతి పని ప్రారంభించే ముందు ప్రమాదాలను అంచనా వేసి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అన్నారు.

వ్యవసాయ విద్యుత్ వినియోగదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వయంగా ఫ్యూజ్లు మార్చేందుకు ప్రయత్నించవద్దని, ఏవైనా లోపాలు తలెత్తినప్పుడు వెంటనే 1912 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని సూచించారు. వ్యవసాయ మోటార్లకు అదనపు లోడ్లు ఉపయోగిస్తున్న రైతులు 5 హెచ్పీ నుంచి 7.5 హెచ్పీ వరకు అదనపు లోడ్లను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకోవాలని కోరారు. విద్యుత్ సరఫరా నాణ్యతను మెరుగుపరచడం, ప్రమాదాల నివారణ లక్ష్యంగా పొడవైన విద్యుత్ లైన్లపై మధ్య స్తంభాల ఏర్పాటు, దెబ్బతిన్న షార్ట్ పోల్స్ మార్పిడి, వదులుగా ఉన్న వైర్ల (లూజ్ స్పాన్లు) సరిదిద్దడం, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ స్తంభాల ప్లింత్లను ఎత్తు పెంచడం, వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లు ఏర్పాటు చేయడం వంటి అంశాలపై అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో విద్యుత్ భద్రతను మరింత బలోపేతం చేసి, అంతరాయం లేని నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడమే టీజీఎన్పీడీసీఎల్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ ఏఈ శ్రీనివాస్ గౌడ్ , ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు.





