
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : విద్యార్థులు ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి, ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే, రోగాలకు దూరంగా ఉండవచ్చని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉడుగుల సురేష్ MD పేర్కొన్నారు.

హుజురాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్ లో గల కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ పాఠశాలలో బుధవారం డాక్టర్ల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను తప్పనిసరిగా పాటించాలన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని, ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్థాలు మాత్రమే స్వీకరించాలన్నారు. భోజనానికి ముందు, మరుగుదొడ్లను ఉపయోగించిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలని సూచించారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మంచినీళ్లను ప్రతిరోజు సమయం అనుగుణంగా క్రమం తప్పకుండా తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు సెల్ ఫోన్ కు, టీవీలకు దూరంగా ఉండాలని సూచించారు. సెల్ ఫోన్, టీవీలను సమయానికి మించి వాడటం, చూడటం ద్వారా కంటి సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా పెరిగిపోతున్నాయని తెలిపారు. అనంతరం డాక్టర్ సురేష్ ను పాఠశాల యాజమాన్యం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు గౌతమ్ రెడ్డి, సంపత్, ఉపాధ్యాయులు వాణి శ్రీ,మమత ,మనోజ్,రాజు, పీటర్ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న డాక్టర్ ఉడుగుల సురేష్

డాక్టర్ సురేష్ ను సత్కరిస్తున్న కేరళ హై స్కూల్ యాజమాన్యం





