
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈరోజు స్థానిక మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులను నిలదీశారు. పట్టణంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలు, వర్షాకాలంలో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, తాగునీటి సరఫరా, మురుగు కాలువల నిర్వహణ, చెత్త సేకరణ, ప్రధాన చౌరస్తాల పరిశుభ్రత తదితర అంశాలపై అధికారులను ప్రశ్నిస్తూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల నుంచి నిరంతరం ఫిర్యాదులు వస్తున్నప్పటికీ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన పనుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోందని, దీనివల్ల ప్రజలు అనవసర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.


పట్టణంలోని ప్రతి వార్డులో పారిశుద్ధ్య పనులు నిరంతరం కొనసాగాలని, మురుగు కాలువలను వెంటనే శుభ్రం చేయాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, చెత్త సేకరణను ప్రతిరోజూ సమర్థవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన చౌరస్తాలు, రహదారులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అధికారులు ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేయాలని, నిర్లక్ష్యం లేదా అలసత్వం ఏమాత్రం సహించబోనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. “ప్రజలను ఇబ్బంది పెట్టే అధికారులను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదు. ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.
హుజురాబాద్ పట్టణాన్ని పరిశుభ్రంగా, సమస్యల రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ప్రతి సమస్యపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తానని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.





