Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ శ్రీమతి పత్తి అనిత అధ్యక్షతన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సిర్సపల్లి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పొద్దుటూరి సతీష్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా పెసర, మినుము, కంది, కూరగాయలు వంటి ఆరుతడి మరియు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయడం రైతులకు ప్రయోజనకరమని తెలిపారు. రైతులు వాతావరణ సూచనలను నిరంతరం గమనిస్తూ, వ్యవసాయ శాఖ అందిస్తున్న శాస్త్రీయ సలహాల మేరకు పంటల యాజమాన్యాన్ని చేపట్టాలని సూచించారు. అలాగే రైతులు తమ సందేహాల నివృత్తి కోసం ప్రతి మంగళవారం రైతు వేదికల్లో నిర్వహించే “రైతు నేస్తం” కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొని వ్యవసాయ నిపుణుల సలహాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గ్రామ సర్పంచ్ పత్తి అనిత మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గిన ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ సాగు చేపట్టాలని కోరారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని, గ్రామంలోని రైతులందరూ శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మంజుల, గ్రామ ఉపసర్పంచ్ ఆవుల సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, కరోబార్ లింగయ్య, వార్డు సభ్యులు మరియు రైతులు పాల్గొన్నారు.






