
—అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి
—యూనిఫాంల స్టిచ్చింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి
—ఇందిరమ్మ ఇళ్లు, వివో భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
—ఎల్ నినో నేపథ్యంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు
—గ్రామాలాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి
—పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, బిల్లులు త్వరితగతిన పరిష్కరించాలి
—జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ఆగస్టు 15లోపు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనిఫాంలు అందేలా అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు. స్వశక్తి మహిళా సంఘాల ద్వారా యూనిఫాంల స్టిచ్చింగ్ పనులను వేగవంతం చేసి, ఏ ఒక్క విద్యార్థి కూడా యూనిఫాం లేకుండా మిగలకుండా పకడ్బందీగా ప్రణాళిక అమలు చేయాలని సూచించారు.


కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం సాయంత్రం అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, డీపీఓ జగదీశ్వర్, డీఆర్డీఓ గీత, జెడ్పీ సీఈఓ పవన్ కుమార్, జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీఓలతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిఫాంల తయారీ, గ్రామాల్లో తాగునీటి సరఫరా, గ్రామాభివృద్ధి ప్రణాళికలు, వివో భవనాల నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల పురోగతి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో గ్రామాల్లో తాగునీటి కొరత రాకుండా ముందస్తు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని, రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సహించాలని కలెక్టర్ సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలు జరిగేలా చూడాలని, వివో భవనాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. జిల్లాకు 332 వివో బిల్డింగులు మంజూరు అయ్యాయని నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు. పెన్షన్ మ్యాపింగ్ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, బిల్లులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి, శానిటేషన్ డ్రైవ్ను మోడల్గా నిర్వహించాలని తెలిపారు. అలాగే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్పై గ్రామ గ్రామాన ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, జలసిరి కింద నీటి సంరక్షణ పనులను ముమ్మరం చేయాలని, గ్రామాలను అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దే దిశగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ విషయంలో నిర్లక్ష్యం ఉండరాదని, “ఏ ఒక్క విద్యార్థికి యూనిఫాం అందలేదనే ఫిర్యాదు రాకూడదు” అని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.





