
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, బిఆర్ఎస్ పట్ల సానుభూతి పెరిగిందని ఈ సమయంలో ఎవరైనా పక్క చూపులు చూస్తే బయటికి వెళ్లాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం హుజూరాబాద్ లో బిఆర్ఎస్ నాయకుల విస్తృతస్థాయి సమన్వయ సమావేశం జరిగింది.

ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలో పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కార్యకలాపాలను పటిష్టం చేసి పార్టీకి మరింత బలమైన పునాది ఏర్పాటు చేయాలని అన్నారు. అడ్డగోలు వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అవి నిలబెట్టుకోక పోవడంతో ప్రజల్లో తీవ్ర సంతృప్తి నెలకొని ఉందని, ఇలాంటి సమయంలో పక్క పార్టీ నాయకులతో (ఈటల రాజేందర్ తో) ఎవరైనా రహస్యంగా టచ్ లో ఉంటే వారు బయటికి వెళ్లిపోవచ్చని, నిజాయితీగా నిబద్ధతగా పనిచేసే వారికి పార్టీ గుర్తింపు లభిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ప్రస్తుతం గులాబీ పార్టీకే మొగ్గు ఉందని ఇలాంటి సమయంలో డబుల్ గేమ్ ఆడేవారు తమ పద్ధతులు మార్చుకోవాలన్నారు.


#నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెట్టండి#
ప్రస్తుత వ్యవసాయ సీజన్లో రైతులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిపై నాయకులు దృష్టి పెట్టి పరిష్కారం కై తనకు తెలుపాలన్నారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో నెలకొన్న పంటల పరిస్థితి, సాగునీటి కొరత, రైతులకు ఎదురవుతున్న యూరియా సమస్యలపై ఎమ్మెల్యే నాయకులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందా, పంటలకు సాగునీరు అందుతున్నదా, ఏయే ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందనే అంశాలపై నాయకులతో వివరంగా చర్చించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొన్న ఏజెంట్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి బూత్ స్థాయిలో పకడ్బందీగా పూర్తి చేయడంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలనీ, ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఇప్పటి నుంచే గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రైతులు, పేదలు, సామాన్య ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వారి పక్షాన నిలబడాలని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని ఎమ్మెల్యే పార్టీ నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బండి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మండలాధ్యక్షులు సంగెం ఐలయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు ఎడవెల్లి కొండాల్ రెడ్డి, కౌన్సిలర్లు గందే శ్రీనివాస్, వర్ధిలేని రవీందర్రావు, నాయకులు, ప్రజా ప్రతినిధులు మాజీ ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
&లోకల్ యాడ్స్&
హుజురాబాద్ జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో వృత్తి విద్య ఉపాధ్యాయుడుగా పనిచేసి పదవీ విరమణ పొందిన మ్యాక రాములు గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: రిటైర్డ్ పిడి సొల్లు సారయ్య, హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





