
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగస్టు 7: హుజురాబాద్ పట్టణంలోని బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి అనుచిత వ్యాఖ్యలతో కూడిన స్టిక్కర్లు అంటించిన ఘటనపై బీజేపీ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.

సిఐ కరుణాకర్ కు ఫిర్యాదు చేస్తున్న బిజెపి నాయకులు..
ఈ ఘటనకు బాధ్యులైన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం హుజురాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా తూర్పాటి రాజు మాట్లాడుతూ.. రాజకీయ భేదాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజమేనని, అయితే ప్రజా ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం లేదా వాటిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైన పద్ధతి కాదన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చిత్రపటంపై అనుచిత వ్యాఖ్యలతో స్టిక్కర్లు అంటించడం ద్వారా ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదని అన్నారు. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా విచారణ జరిపి, సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించి బాధ్యులను గుర్తించి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని, హుజురాబాద్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదన్నారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటిరాజు, పట్టణ 21 వ వార్డ్ కౌన్సిలర్ పంజాల మనోజ్, మంచికట్ల మురళి, పట్టణ మాజీ అధ్యక్షులు గంగిశెట్టి రాజు, గంగిశెట్టి ప్రభాకర్, సెంట్రల్ ఫిలింబోర్డ్ నెంబర్ సబ్బని రమేష్ నరాల రాజశేఖర్, తిప్పబత్తిని రాజు, గుర్రం సంతోష్, కొలిపాక వెంకటేష్, డోరి ఐలయ్య, దాసరి వీరయ్య, ఠాగూర్ రాజేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





