
-విద్యార్థులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో గత పది ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో గాడి తప్పిన విద్య వ్యవస్థను రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరిదిద్దాలని విద్యారంగంపై బిఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయవద్దని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు విద్య వ్యాపారం చేస్తూ ఫీజుల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారని, సిఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడీ అరికట్టే విధంగా చర్యలు తీసుకొని ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల హామీలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను విద్యాసంవత్సరం ప్రారంభం కాగానే అమలు చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి అన్నారు. గురువారం హుజురాబాద్ పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మణికంఠరెడ్డి మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలనలో విద్యారంగం పూర్తిగా భ్రష్టుపట్టి పోయిందని, విద్యారంగం పై కెసిఆర్ సమీక్ష చేయకుండా రాష్ట్రంలో విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేశాడన్నారు. గత పది ఏళ్లలో గాడి తప్పిన విద్యారంగాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేయాలన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడి అరికట్టే విధంగా ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల కాక విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కళాశాలలకు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వము విద్యారంగము బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు, యూనివర్సిటీలలో మౌలిక వసతులు కల్పించి ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేసి ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెరిగేల కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విద్యార్థులకు, యువకులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటిలు, ల్యాప్ టాప్స్, మండలానికో ఇంటర్నేషనల్ పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి కృషి చేయాలని విద్యార్థులకు ప్రభుత్వ విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావాలని, ఫీజుల పేరిట ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న ఫీజుల దోపిడిని అరికట్టి, ప్రభుత్వం విద్యాశాఖ ఫీజులు నియంత్రణకి కఠిన చట్టాలు అమలు చేయాలన్నారు. నిబంధనలు పాటించని విద్యాసంస్థలను సీజ్ చేయాలని మణికంఠరెడ్డి డిమాండ్ చేశారు
ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రామరాపు వెంకటేష్, జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్, మండల అధ్యక్షుడు వేణుగోపాల్, నాయకులు రోహిత్, కృష్ణ, వంశీ, రవి తదితరులు పాల్గొన్నారు.