
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్;
ఈనాడు గ్రూప్స్ అధినేత, మీడియా మొఘల్ చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్టార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. 1936 నవంబర్ 16న ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించిన ఆయన తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలోనూ రామోజీరావు నిర్మాతగా వెలుగొందారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఫిలిం సిటీని నిర్మాణం చేశారు. డాల్ఫిన్ హోటల్స్, మార్గదర్శి చిట్స్ వంటి వ్యాపారాలకు కూడా నిర్వహించారు. శనివారం తెల్లవారు జామున వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తుండగా రామోజీ తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియాగానే పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.


మీడియా మొఘల్.. 1974 AUG 10న నక్కవానిపాలెం(విశాఖ) లో ‘ఈనాడు’ తొలి ఆఫీసు ప్రారంభించారు. 5000 ప్రతులతో ఈనాడు ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన పత్రికారంగంలో విప్లవాత్మక మార్పులకు పునాది వేశారు. 1995లో ETV ఛానల్ ను ప్రారంభించి ‘ఈటీవీ.. మీటీవీ’ స్లోగన్ తో ప్రతి ఇంట వినోదాన్ని పంచారు. 2003లో ETV-2 పేరిట తెలుగు రాష్ట్రాల్లో తొలి 24 గంటల వార్తా ఛానల్ ను తీసుకొచ్చారు. దీన్ని 2014లో ETV AP, TGగా మార్చారు. రామోజీరావు మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ తో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.