
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
అభివృద్ధికి ఆమడ దూరంలోఅట్టడుగున దుర్భర జీవితాలను కొనసాగిస్తున్న ప్రజల పక్షాన నిలబడి రాజ్యాంగ పరిధిలో పోరాడుతున్న పౌరహక్కులనేతలు,రచయితలు,సామాజిక ఉద్యమకారులపై”ఉపా”చట్టం
క్రింద అక్రమాకేసుల్లో అరెస్టులు చేస్తూ సంవత్సరాల తరబడి జైలు లో బంధిస్తూ,ప్రభుత్వాలు కక్షసాధింపు ధోరణులకు పాల్పడుతున్నాయని జనసాహితీ హుజురాబాద్ కన్వీనర్ఆవునూరి సమ్మయ్య, సభ్యులు ముక్కెర రాజు, పల్కల ఈశ్వర్ రెడ్డి, రవిశంకర్ శుక్లాలు శనివారం ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించే గొంతులకు అడ్డుకట్ట వేసేందుకే పాలకులు”ఉపా”చట్టాన్ని ఆయుధంగా చేసుకుని రాజ్యాంగం ద్వారా లభించిన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు.
“ఉపా” చట్టం కింద అరెస్టు కాబడి ఏళ్ళ తరబడి అక్రమంగా నిర్బంధించిన వారిపై చేసిన ఆరోపణలను ప్రభుత్వాలు కోర్టుల్లో నిరూపించ లేకపోతున్నాయన్నారు. 14 ఏళ్ల క్రితం నాటి అంశాన్ని ఇప్పుడు తిరగదోడి ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్,కాశ్మీర్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ న్యాయశాస్త్ర ప్రొఫెసర్ షౌకత్ హుస్సేన్ లతో పాటు మరికొందరి పై “ఉపా”చట్ట కింద కేసు నమోదుచేసేందుకు అనుమతినివ్వడం అప్రజాస్వామికం, అన్యాయం అని చెప్పారు. దేశంలోని ప్రజాస్వామికవాదులను, రచయితలను, మేధావులను, హక్కుల కార్యకర్తలను, ప్రగతిశీల విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేసేందుకు పాలకులు దుర్వినియోగపరుస్తున్న”ఉపా” చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
