
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఉన్న విద్యారంగ మౌలిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గస్థాయి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పాఠశాలల సమస్యలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యేకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో ఉన్న పాఠశాలల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని చెప్పారు. పాఠశాలల సమస్యలను తన దృష్టికి నేరుగా తీసుకొని రావచ్చని, మీలో ఒకడిగా ఆ సమస్యను తెలుసుకొని పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. ఇంతే కాకుండా నియోజకవర్గంలో మంచి ఫలితాలు వచ్చే విధంగా మరింత కృషి చేయాలని ఆయన ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. గత విద్యా సంవత్సరంలో 93% ఫలితాలు సాధించిన వారు ఈ ఈ విద్యా సంవత్సరంలో వందకు వంద శాతం ఉత్తీర్ణులయ్యే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఆయా ప్రధానోపాధ్యాయులకు వచ్చే వారంలో ఘనంగా సన్మానించేలా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల ఇతర పాఠశాలల పిల్లలు ఉపాధ్యాయులు స్ఫూర్తి పొందుతారని అన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన విద్యా సంవత్సరంలో మంచి ఫలితాలు రావడానికి ఇది మార్గదర్శకంగా మారుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో జెడిపి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మున్సిపల్ చైర్ పర్సన్లు గందె రాధిక, రాజేశ్వరరావు, ఎంపీపీ ఇరుమళ్ళ రాణి, జెడ్పిటిసి సభ్యుడు పడిదం బక్కారెడ్డి, ఎంఈఓలు కేతరి వెంకట నరసింహారెడ్డి, విడపు శ్రీనివాస్, రామ్ కిషన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య, ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.



