
–సంజయ్ ను సాదరంగా ఆహ్వానించిన చిరు
–ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని శాలువాతో సత్కరించిన చిరంజీవి
–సంజయ్ గారు….ఎంతో కష్టపడ్డారు.. మీకు తగిన పదవి లభించిందన్న చిరు
–విద్యార్ధి దశలో మీ సినిమాలకు నేను వీరాభిమానిన్న బండి సంజయ్
–ఇరువురి మధ్య రాష్ట్ర, దేశ రాజకీయాలపై అరగంటకుపైగా చర్చ
–చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉందన్న బండి సంజయ్
–మర్యాదపూర్వకంగానే కలిశానన్న బండి సంజయ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పద్మభూషణ్, మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. కొద్దిసేపటి క్రితం జూబ్లిహిల్స్ లోని ఆయన నివాసానికి చేరుకున్న బండి సంజయ్ ను చిరంజీవి సాదరంగా ఆహ్వానించి తన నివాసానికి తోడ్కోని వెళ్లారు. శాలువా కప్పి సత్కరించారు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ‘‘సంజయ్ గారు… మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు. మీరు మంత్రి కావడం చాలా ఆనందంగా ఉంది. మీ అగ్రెసివ్ మెంటాలిటికి తగిన పోస్ట్ లభించింది.’’అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ తమను దగ్గరకు తీసుకుని పలకరించడం మర్చిపోలేని అనుభూతిగా మిగిలిందని ఈ సందర్భంగా చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా బండి సంజయ్ స్పందిస్తూ ‘నేను విద్యార్ధి దశలో మీ సినిమాలకు అభిమానిని’’అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, బీజేపీ, జన సేన కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. ప్రజలకు మంచి పాలన అందిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఇరువురు దేశ, రాష్ట్ర రాజకీయాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. బండి వెంట పలువురు బిజెపి నాయకులు, సన్నిహితులు ఉన్నారు.


