
స్వర్ణోదయం ప్రతినిధి, జనగామ జిల్లా,జులై 01: జనగామజిల్లా కలెక్టరేట్ లో ఓ మహిళా రైతు సోమవారం ఆత్మహత్యాయత్ననికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. ఇటీవలే భూ వివాదం నేపథ్యంలో ఓ రైతు పురుగుల మందు తాగి కలెక్టరేట్ భవనం పైకేక్కి బలవన్మ రణానికి ప్రయత్నించాడు. ఆ సంఘటన మరవక ముందే తాజాగా…మరో సంఘటన జరగడంతో చర్చనీయాంశంగా మారింది.
జనగామ జిల్లా నర్మెట మండలానికి చెందిన దేవరపల్లి జ్యోతి తన వ్యవసాయ భూసమస్య విషయమై ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగించింది. భూ వివాదంలో జ్యోతి గత కొద్ది రోజులుగా అధికారుల చుట్టూ తిరిగినా, పట్టించుకోవడంలేదని మనస్థాపం చెంది సోమవారం ఉదయం కలెక్టరేట్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయ త్నానికి ప్రయత్నించింది.
ఆది గమనించిన స్థానికంగా ఉన్న పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. అయితే అప్పటికే ఇంటివద్ద నిద్ర మాత్రలు మింగి ఇద్దరు పిల్లలతో కలిసి కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి జ్యోతి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జ్యోతిని చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ప్రధాన హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
