
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని హుజురాబాద్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చందు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లు, ల్యాబ్ డయాగ్నస్టిక్స్ సెంటర్లు తప్పకుండా తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ధరల పట్టికల బోర్డులను ప్రదర్శించాలన్నారు. ఆసుపత్రిలోని డాక్టర్ల వివరాలను, సిబ్బంది వివరాలను, సేవల వివరాలతో కూడిన బోర్డులను కూడా ఏర్పాటు చేయాలని అన్నారు. ఆసుపత్రిలో తగిన ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని, సరైన రికార్డులు మెయింటైన్ చేయాలని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు. ప్రైవేట్ ఆస్పత్రులు రిజిస్టర్ అయిన తర్వాతనే ప్రారంభించాలని, అలా కానీ యెడల కఠిన చర్యలు తీసుకోబడతాయని డాక్టర్ చందు హెచ్చరించారు. ఈ చట్టం ప్రకారం ఆన్ని రకాల వైద్య విధానాలు ఆనగా అల్లోపతిక్, డెంటల్ , ఆయుర్వేద, యునాని, హోమియో, నాచురోపతి, క్లినిక్ లు & ఆసుపత్రులు, ఫిజియోతెరపీ సెంటర్లు తప్పని సరిగా నమోదు చేసుకోవాలన్నారు. అలాగే అన్నీ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబoదించిన రిపోర్టులు, డెంగ్యూ, మలేరియా పాజిటివ్ వస్తే డిఎంహెచ్ఓ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని, జనన వివరాలను బర్త్ మానిటరింగ్ పోర్టల్ లో, స్కానింగ్ వివరాలని పిసి&పిఎన్డిటి పోర్టల్ లో తప్పని సరిగా ప్రతి దినం నమోదు చేయాలని పేర్కొన్నారు. అర్హత లేని వారు డాక్టర్లుగా చెలామణి అవుతూ వైద్య నిర్వహణ చేస్తున్నట్లు అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. ప్రజలు ఇలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తలు వహించాలని, అర్హతలేని, రిజిస్టర్ పొందని వారిని ప్రోత్సహించ వద్దు అని డాక్టర్ చందు సూచించారు.






