
- పట్టుబడిన 53 వాహనాలు
- కౌన్సిలింగ్ నిర్వహించిన ఏసిపి శ్రీనివాస్ జి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి జమ్మికుంట(హుజురాబాద్): జమ్మికుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం స్థానిక టౌన్ సిఐ వరగంటి రవి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ లేనివి, అలాగే మైనర్లు నడిపిన వాహనాలతో పాటు ట్రిపుల్ రైడ్ చేసిన వాహన దారులను గుర్తించి 53 ద్విచక్ర వాహనాలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. తరలించిన వాటిని హుజురాబాద్ ఏసిపి సిహెచ్ శ్రీనివాస్ జి పరిశీలించి వాహనదారులకు స్టేషన్ ఆవరణంలోనే కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసిపి వాహనదారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వాహనానికి తప్పకుండా నెంబర్ ప్లేట్ కనబడే విధంగా ఉండాలని, నెంబర్ ప్లేట్ల పైన పిచ్చి పిచ్చి రాతలు రాయకూడదని వాహనదారులకు సూచించారు. దానితోపాటు మైనర్లు నడిపేందుకు వాహనాలు ఇస్తే వాహన యజమానిపై కొత్త చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని, అంతేకాకుండా భారీగా జరిమానలు విదించాల్సి వస్తుందని తెలిపారు. ఒక్కొ ద్విచక్ర వాహనంపై ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారని ఇది చట్ట వ్యతిరేకమని అన్నారు. ఇకపై ఎవరైనా వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్లు, డ్రైవింగ్ లైసెన్స్, ఫుల్ ఇన్సూరెన్స్ లేకుండా, నెంబర్ ప్లేట్లు లేకుండా ట్రిపుల్ రైడ్ చేసినా, మైనర్లకు వాహనాలు ఇచ్చిన నూతన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే వాహనదారులకు నూతన చట్టాలపై సమగ్ర అవగాహన కల్పించారు, చట్ట పరిధిలో ఏ విషయంలోనైనా పోలీసులు ప్రజలకు సహకరిస్తారని, పోలీసులకు ప్రజలు, వాహనదారులు కూడా సహకరించినట్లైతే చట్టబద్ధంగా ఏ పనైనా పోలీసులు చేస్తారన్నారు. చట్ట వ్యతిరేక పనులు చేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వరగంటి రవి, ఎస్ ఐ రాజేష్, పోలీస్ సిబ్బంది, వాహనదారులు, మైనర్ బాలురు తదితరులు ఉన్నారు.









