
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:రుణమాఫీ జీవోను రైతుల రుణమాఫీకి ప్రయోజనకరంగా సవరించాలనీ తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను విస్మరిస్తూ నేడు జీవోల పేరుట రైతులను అయోమయ పరిస్థితిలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.567 తేది. 1572024 ప్రకారం రైతుల రుణమాఫీకి రూపొందించిన నిబంధనలలో గల అంశాలను సవరించి 2లక్షల వరకు రుణం పొందిన రైతులకు లబ్ధి పొందేలా సవరించాల్సిందిగా తెలంగాణ రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరుతున్నదన్నారు.
ప్రభుత్వ జీవో ప్రకారం రేషన్కార్డు ఆధారితంగా ఉన్నవారందరినీ ఒకేకుటుంబంగా పరిగణించి, కుటుంబంలో ఒక వ్యక్తికే రుణమాఫీ వర్తింపజేయడం వలన కుటుంబంతో విడిపడినవారికి రుణమాఫీ వర్తించదనీ, ఆదార్కార్డు, పాస్బుక్ డేటా, పిడిఎస్(రేషన్కార్డు డేటా) ఒకటిగా ఉన్న వారికే వర్తింపచేశారన్నారు. ఆదార్కార్డు లేని వారు, పాస్బుక్, రేషన్ కార్డు లేని కుటుంబాలు లక్షల్లో ఉన్నాయనీ పాసు పుస్తకాల కొరకు ధరణిలో 12 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ ప్రజాపాలన సర్వేలో తేలిందనీ గుర్తు చేశారు. అలాగే రేషన్కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారనీ, ప్రభుత్వ జీవో ప్రకారం ఆదార్కార్డు, పాస్బుక్, రేషన్కార్డు ఉన్న వారికే వర్తింపజేయడం సరికాదన్నారు. వ్యవసాయం కొరకు రుణం తీసుకున్న సెల్ఫ్హెల్ప్ గ్రూప్స్ (స్యయం సహాయక బృందాలు) జాయింట్ లయబిలిటీ గ్రూప్, రైతు మిత్ర గ్రూప్, కౌలుదారులకు ఇచ్చిన లోన్ ఎలిజబిలిటీ కార్డు ఉన్న వారికి రుణ మాఫీ వర్తించదని ప్రకటించడం కరెక్ట్ కాదన్నారు. వాస్తవానికి ఈ నాలుగు గ్రూపుల్లోని వారు అత్యంత పేదలే కాక దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల్లో ఉండి వచ్చిన వారే ఎక్కువ అన్నారు. రీషెడ్యూల్డ్ చేసిన రుణాలకు కూడా రుణమాఫీ వర్తించదని నిబంధన చెబుతున్నదనీ,గతంలో కరువులు,వరదల వల్ల నష్టపోయిన రైతులకు బ్యాంకులు రుణారు 35 సంవత్సరాల వాయిదాలపై రీషెడ్యూల్ చేశారనీ గుర్తు చేశారు. వీరికి రుణమాఫీ వర్తించదనీ, రెండు లక్షలకు మించి రుణం పొందిన వారు, రెండు లక్షలకు పైన ఉన్న అప్పు చెల్లిస్తేనే మాఫీ వర్తిస్తుందని నిబంధన పెట్టాడం సరికాదన్నారు. గత 10 సంవత్సరాలుగా బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడం వల్ల అసలుకు మించి వడ్డీలు పెరిగాయను, చాలామంది రైతులు రెండు లక్షలకు పైగా బాకీలు ఉన్నప్పటికీ గతంలో ప్రకటించిన 2014,2018 రుణమాఫీ పథకాలు వారికి వర్తించలేదనీ కృషి చేశారు. అట్టి వారికి రుణం రెండు లక్షలకు పైగా ఉందనీ వారు అప్పు చెల్లించగలిగిన స్థితిలో లేరన్నారు. ప్రస్తుతం వానాకాలం పంటలు వేయడం ప్రారంభించడంతో రైతుల పెట్టుబడికి ఇబ్బందులు పడుతున్నారనీ, జూన్ సెప్టెంబర్ మధ్య రెండు లక్షలకు పైగా ఉన్న అప్పు చెల్లించడం సాధ్యం కాదన్నారు. పిఎం కిసాన్ డేటాకు రుణమాఫీని జోడిచడం వలన చాలా మంది రైతులు రుణమాఫీ అర్హత కోల్పోతారన్నారు. రాష్ట్రంలో 72లక్షల మంది రైతులు ఉన్నప్పటికీ బ్యాంకులు 43లక్షల మందికి మాత్రమే అప్పులిచ్చాయనీ, పిఎం కిసాన్ పథకం కింద 31 లక్షల మందికే వర్తింపజేశారన్నారు. అందువలన పిఎం కిసాన్ డేటాను వర్తింపజేయడం వలన అర్హత కలిగిన వారు రుణమాఫీ పొందలేకపోతారన్నారు. 12.12.2018 నుండి 9.12.2023వరకు ప్రకటించిన రుణమాఫీని వర్తింపజేయడానికి కొన్ని బ్యాంకులు జనవరి 2024 నుండి రుణాలను కొత్త రుణాలుగా రీషెడ్యూల్ చేశాయన్నారు. గతం నుండి బ్యాంకులు‘బుక్ అడ్జెస్ట్మెంట్’ ద్వారా రైతులకు రుణాలు పెంచుకుంటూ వస్తున్నాయన్నారు. అందువల్ల 9.12.2023 తర్వాత రీషెడ్యూల్ చేసిన రుణాలకు లేదా బుక్ అడ్జెస్ట్మెంట్ చేసిన రుణాలకు రుణమాఫీని వర్తింపజేయాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నదన్నారు. ఇందుకు అనుగుణంగా జీవోను సవరించాలని రాము కోరారు.






