
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: నిన్న రాత్రి హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా ఎదురుగా పాపారావు బొందలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆర్థికంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు హుజురాబాద్ పోలీసులు అండగా నిలిచారు. హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జి మంగళవారం సాయంత్రం తన కార్యాలయం వద్ద రేక్కాడితే గానీ డొక్కాడని 10 మంది అగ్ని ప్రమాద బాధితులను గుర్తించి ఒక్కొక్కరికి తక్షణ సహాయంగా రూ. 3000 చొప్పున 30,000 నగదును పదిమందికి అందజేశారు. అగ్ని ప్రమాదం సంభవించి చిరు వ్యాపారుల జీవనోపాధి లేకుండా చేయడం అత్యంత బాధాకరమని, తమ వంతుగా ఏదో ఉడుతా భక్తిగా ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరుపై సమీపంలోని సీసీ కెమెరాలు ఆధారంగా పూర్తిస్థాయి దర్యాప్తుకు చేస్తామని విద్యుత్ ఘాతం అయితే ప్రభుత్వపరంగా ఆదుకునేలా సహకరిస్తామని, ఏదైనా కావాలని చేసినట్లయితే ఎంతటి వారినైనా విడిచి పెట్టేది లేదని ఎసిపి శ్రీనివాస్ జి హెచ్చరించారు. బాధితులు మనోవేదనకు గురికాకుండా, ఆర్థికంగా కృంగిపోకుండా ఉండేందుకే సబ్ డివిజన్ పోలీసుల సహకారంతో బాధితులకు ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని ఎసిపి తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్, జమ్మికుంట టౌన్ సిఐలు బొల్లం రమేష్, వి రవి, సబ్ డివిజన్లోని ఎస్ఐలు, అగ్నిప్రమాద బాధితులు పాల్గొన్నారు.







