
-హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏడుగురు వైద్యుల బదిలీ!
-ముగ్గురు వైద్యుల చేరిక
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ ప్రాంతానికే పెద్దదిక్కుగా ఉన్న ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించే ఏడుగురు వైద్యులు బదిలీ కాగా వారి స్థానంలో తిరిగి ముగ్గురిని నియమించడం అధికారుల తీరును విమర్శలకు దారి తీస్తుంది. హుజురాబాద్ నుండి బదిలీ అయిన వారిలో డాక్టర్ వాణిలత కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి బదిలీ కాగా, డాక్టర్ పల్లవి మాత శిశు సంరక్షణ కేంద్రం కరీంనగర్ కు బదిలీ అయ్యారు. అలాగే డాక్టర్ శ్రీనివాస్ జిల్లా ఆసుపత్రి కరీంనగర్ కు బదిలీ కాగా, డాక్టర్ ప్రత్యూష పరకాల ఏరియా ఆసుపత్రికి బదిలీ అయ్యారు. డాక్టర్ అర్చన వర్ధన్నపేట ఏరియా హాస్పిటల్ కు బదిలీ కాగా డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ మహిపాల్ రెడ్డి లు కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి బదిలీ అయ్యారు. వీరి స్థానంలో కరీంనగర్ నుండి డాక్టర్ నిశ్చల గైనకాలజిస్ట్, డాక్టర్ సుభాంగిని పీడియాట్రీషియన్, డాక్టర్ రాజేష్ జనరల్ మెడిసిన్ వైద్యులు హుజురాబాద్ కు బదిలీ పై రానున్నారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గంలోని సుమారు 110 గ్రామాలకు పెద్దదిక్కుగా ఉన్న ఏరియా ఆసుపత్రిలో అసలే అరకోరగా ఉన్న వైద్యులలో ఉన్నవారి నుండి ఏడుగురు వైద్యులను బదిలీ చేయగా వారి స్థానంలో కేవలం ముగ్గురు వైద్యులను మాత్రమే తిరిగి నియమించడం పలు విమర్శలకు దారితీస్తుంది. అసలే అరకొరగా అందుతున్న వైద్య సేవల పట్ల ప్రజల నుండి అనేక విమర్శలు వస్తుండగా, ఏలాంటి చిన్న విషయమైనా వరంగల్, కరీంనగర్, హైదరాబాద్, ఇతర ప్రైవేటు దావకాండ్లకు రేఫర్ చేస్తున్న వైద్యులతో ప్రజలు సతమతం అవుతున్నారు. ఉన్న వైద్యులలో ఏడుగురిని బదిలీ చేసి అందులో సగం మంది కన్న తక్కువ మాత్రమే తిరిగి నియమించడం ప్రజలకు వైద్య సేవలపై నమ్మకం సన్న గిల్లేలా చేస్తుంది. ఇప్పటికైనా హుజురాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, అధికారులు హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి పై ప్రత్యేక దృష్టి పెట్టి సరిపడా వైద్యులను నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.






