
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:జులై 29
తెలుగు ఇండస్ట్రీలో విషాద సంఘటనలు నెలకొంటు న్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణంతో అయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఘట్టమనేని అభి మానులు మరొక చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినీ నిర్మాత, సూపర్ స్టార్ కృష్ణ బావమరిది అయిన ఉప్పలపాటి సూర్య నారాయణబాబు( 74 ) ఆదివారం సాయంత్రం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు కృష్ణా జిల్లా, పామర్రు మండలం రిమ్మనపూడి గ్రామంలో జన్మించారు. సూపర్ స్టార్ కృష్ణ రెండవ సోదరైన లక్ష్మీ తులసితో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. పద్మావతి ఫిలిమ్స్ బ్యానర్ పై తెలుగు, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 24 సినిమాలు నిర్మించారు. నిర్మాతగా సినీ పరిశ్రమకు సేవలందించిన ఆయన ఇక లేరు అనే మాట ఘట్టమనేని అభిమానులకు బాధ కలిగిస్తుంది.
మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడీ, సంధ్యా, బజారు రౌడి, అల్లుడు దిద్దిన కాపురం, శంఖారావం వంటి హిట్ మూవీస్ నిర్మించారు. ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు 1985లో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నుండి టీడీపీ అధినేత ఎన్టిఆర్ పై పోటీచేసి ఓటమి చెందారు. తరువాత జరిగిన పరిణామాలలో 15 సం.ల క్రితం నారా చంద్రబాబునాయుడు, వడ్డే శోభనాద్రీశ్వర రావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాటి నుండి నేటి వరకు టీడీపీలో తన వంతు భాద్యతలు నిర్వర్తిస్తూ పార్టీకి ఎనలేని సేవలు చేసారు. ఇటీవల గుంటూరు టీడీపీ లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని విజయం కోసం ఉప్పలపాటి సూర్య నారాయణబాబు కృషి చేసారు.
