
మండల యాదగిరి, స్వర్ణోదయ ప్రతినిధి హుజురాబాద్: అధికారుల ఆలక్ష్యం వల్ల ఉద్యోగాలు రాక నష్టపోయిన డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలు ఇప్పించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని మధువన్ గార్డెన్ లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్ల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… 1998లో అధికారుల తప్పిదం వల్ల ఉండి కూడా తమకు ఉద్యోగాలు రాలేదని, తమకు న్యాయం చేయాలని అప్పటినుండి అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని అన్నారు. 98 క్వాలిఫైడ్ టీచర్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ నేటి వరకు తమకు న్యాయం జరగలేదని అన్నారు. ప్రజల తరఫున పోరాడే మీరు 30 ఏళ్లుగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఎంతోమంది నిరుద్యోగుల సమస్యపై ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి తమకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరారు. కాగా ఈ విషయంపై ఇప్పటికే శాసనసభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగిందని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎస్సీ 98 క్వాలిఫైడ్ టీచర్ల సంఘం రాష్ట్ర నాయకులు పిట్టల సంజీవ్, శ్రీనివాస్, కొత్త రాజిరెడ్డి, చంద్రమౌళి, మంచికట్ల సమ్మయ్య, మారుతీ ప్రసాద్, ఎంబాడీ శంకర్, పాడి విజయపాల్ రెడ్డి, దోమల కుమారస్వామి, కిరణ్ కుమార్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
