
–స్వతంత్ర సమరయోధురాలు జైలు నుండి వచ్చినట్టు సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు
–తెలంగాణ బ్రాండ్ ను దెబ్బతీసిన కవితకు రాష్ట్రంలో నివసించే హక్కు లేదు
తక్షణమే శాసనమండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 150 పై చిలుకు రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్ పై విడుదల అయిన కవిత చిత్రపటానికి యువజన కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో కవిత చిత్రపటానికి లిక్కర్ పోసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇన్ని సంవత్సరాలు తెలంగాణ పేరు చెప్పుకొని పది సంవత్సరాలు అధికారం అనుభవించి కోట్లు కూడబెట్టిన కేసీఆర్ కుటుంబం వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, కవితకు తెలంగాణలో నివసించే నైతిక హక్కు లేదని అన్నారు. తెలంగాణ బ్రాండ్ దెబ్బతీసిన కవిత వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాష్ట్రం విడిచిపెట్టి వెళ్లాలని డిమాండ్ చేశారు. స్వతంత్ర సమరయోధురాలు జైల్ నుండి వచ్చినట్టు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే జనాలు ముక్కున వేలు వేసుకుంటున్నారని కేసు ముగిసినట్టు సంబరాలు చేసుకోవడం చూస్తుంటే జాలి వేస్తుందన్నారు. నా పోరాటం ఆగదు అని ప్రగల్బాలు పలుకుతున్న కవిత ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు. ఇన్ని రోజులు జైలులో ఉన్నప్పటికీ కనీసం ఆమెకు తప్పు చేశాను అన్న పశ్చతాపం లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంత పెద్ద కుంభకోణంలో నేర ఆరోపణలు ఎదుర్కొన్న కవితను శాసనమండలి సభ్యత్వం రద్దు చేయాలని, బిఆర్ఎస్ పార్టీ నుండి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్, మానస, నాగమణి, బండ నవీన్, జంగ అనిల్, వినోద్ రెడ్డి, చల్లూరి విష్ణువర్థన్, ముక్క రవితేజ, ప్రసాద్, నాగరాజు, అఖిల్, రాజేష్ లు పాల్గొన్నారు.






