
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఒక యువకుడు విద్యుత్తో షాక్ తో మృతి చెందడం తీవ్ర విషాదం నెలకొంది. శనివారం పండుగ ఉత్సహంలో ఉన్న ఆ యువకుడు గణేష్ మండపంలో లైట్ బిగిస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్సపల్లి గ్రామానికి చెందిన వంగ వెంకటేష్- లావణ్యలకు యశ్వంత్(17) ఏకైక కుమారుడు. ఇంటర్మీడియట్ చదువుతున్న ఆ యువకుడు వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపంలో బల్బు బిగిస్తుండగా బల్బు పగిలి విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి గమనించి యశ్వంత్ ను వెంటనే హుజురాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే యశ్వంత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పండుగ రోజే ఈ సంఘటన జరగడంతో వెంకటేష్ లావణ్య కుటుంబంలో తీరని విషాదం నింపింది. అంతేగాక తమ కండ్ల ముందే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందడంతో గ్రామ ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు. సమాచారం అందుకున్న టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు విద్యుత్ విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని సిఐ సూచించారు.

