
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్లనే ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని, పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా మసులుకోవాలని మున్సిపల్ కమిషనర్ సల్వాది సమ్మయ్య అన్నారు. శుక్రవారం హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులోని దమ్మక్కపేటలో డ్రై డే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తొమ్మిదో వార్డ్ కౌన్సిలర్ మెరుగు కొండల్ రెడ్డి మాట్లాడుతూ… ప్రజలు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని, మురికి కాలువలలో చెత్తా చెదారము వేయకుండా ప్రతిరోజూ ఇంటింటికీ వచ్చే పారిశుద్ధ్య తోపుడు బండ్ల వారికి చెత్తను అందించాలని అన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండుటకు గాను ఇంటి పరిసరాలలో వర్షపు నీరు, మురుగు నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ కిషన్ రావు, వార్డు అధికారి సరిత, అంగన్వాడి టీచర్ తిరుపతమ్మ, రేణుక, ఆశ వర్కర్ శ్రీలత, డ్రైవర్ అజ్జు, వర్కర్లు బొందయ్య, రవి, కరుణ తదితరులు పాల్గొన్నారు.








