
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే 15 మంది మున్సిపల్ అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులను తొలగిస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం మున్సిపల్ కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. మధ్యాహ్నం విధులకు హాజరైన కార్మికులు తమలోని 15 మందిని మున్సిపల్ పాలకవర్గం తొలగిస్తున్నారని సమాచారం తెలియడంతో ఒక్కసారిగా వారంతా విధులకు హాజరు కాకుండా మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారుల తీరుకు, పాలకవర్గంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 15 మందిని తొలగించి మళ్లీ కొత్త వారిని నియమించడానికి పాలకవర్గం ప్రయత్నిస్తుందని వారు ఆరోపించారు. తమ పొట్ట కొట్టితే వారికేమీ వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ లో 142 మంది ఔట్సోర్సింగ్ కార్మికులు పనిచేస్తుండగా 12 మంది పారిశుద్ధ్యం పని కాకుండా ఇతర పనులకు వినియోగించడం ఏమిటని వారు ప్రశ్నించారు. అందరికీ ఒకే వేతనం వస్తున్నప్పుడు వారు పారిశుధ్యం పని కాకుండా ఇతర పనులకు ఎలా వినియోగిస్తారని అన్నారు. 15 మందిని తొలగించి వారి స్థానంలో కొత్త వారికి స్థానం కల్పించి మా పొట్టలు కొట్టడం ఏమిటని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమందికి ఆరోగ్యం బాగా లేకుంటే పనికి రావడంలేదని వారి వారి స్థానంలో వేరే వారిని తీసుకోవడం సమంజసం కాదని వారన్నారు. వెంటనే తమకు కమిషనర్ సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం కమిషనర్ ఎస్ సమ్మయ్య మాట్లాడుతూ … కార్మికులను ఎవరిని తొలగించే ఉద్దేశం లేదని, కేవలం కొంతకాలంగా విధులకు హాజరు కాని వారిని మందలించే ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం లేదని అన్నారు. పట్టణంలో పారిశుద్ధ్యం సక్రమంగా ఉండాలంటే కార్మికులంతా తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలని, కొద్ది నెలలుగా విధులకు రాకుండా గైర్హాజర్ అవుతున్న వారిని మందలించకుంటే ఎలా అని ఆయన అన్నారు. కమిషనర్ హామీతో కార్మికులు సాయంత్రం ఆందోళన విరమించారు.






