
–చేనేత కార్మికుల సంక్షేమమే
కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం..
–మాట మీద ఉండేది కాంగ్రెస్సే..
–గత బిఆర్ఎస్ పాలకులు నేత కార్మికులను మోసం చేశారు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి,కరీంనగర్: సిరిసిల్ల నేత కార్మికులు గత 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న యార్న్ డిపో దసరా కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. వేములవాడలో యార్న్ డిపో మంజూరుతో సిరిసిల్లలో వేలాది మంది కార్మికులకు ప్రయోజనం కలుగనుందని తెలిపారు. సోమవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నేత కార్మికుల 30 ఏళ్ల కల కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని పేర్కొన్నారు. గత బిఆర్ఎస్ పాలకులు సిరిసిల్లలో యార్ను డిపో ఏర్పాటు చేస్తామంటూ ప్రగల్బాలు పలికారని మండిపడ్డారు.
మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని ఆరోపించారు. యార్న్ డిపో మంజూరు చేయించలేక పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. గత బిఆర్ఎస్ పాలకులు నేత కార్మికులను ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప వారి ప్రయోజనాలు ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు. నేత కార్మికుల కష్టాలను చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అలాగే విద్యుత్ బిల్లుల బకాయిని కూడా తీర్చారని తెలిపారు. గత బిఆర్ఎస్ పాలకులు 10 ఏళ్ల కాలంలో సాధించినది కాంగ్రెస్ ప్రభుత్వం పది నెలల్లోనే యార్ను డిపో మంజూరు చేసి నేత కార్మికుల కల నెరవేర్చిందని స్పష్టం చేశారు.
యార్ను డిపోను వేములవాడలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, డిపో ఏర్పాటుకు తక్షణం 50 కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. వేలాది కార్మికులకు ఇబ్బందులు తప్పుతాయని, ఉచితంగా యార్న్ లభించడంతో పాటు చేతినిండా పని దొరుకుతుందని తెలిపారు. గతంలో నేత కార్మికులు యార్న్ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లి నానా ఇబ్బందులు పడేవారని, ఆ ఇబ్బందులు పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం యార్న్ డిపో మంజూరు చేసిందని చెప్పారు. యార్న్ డిపో మంజూరుతో బతుకమ్మ సంబరాలు, దసరా పండుగను నేత కార్మికులు మరింత ఘనంగా వారి ఇళ్లలో వెలుగులు నిండేలా జరుపుకుంటారని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. ఇందుకోసమే బతుకమ్మ, దసరా పండుగను కార్మికులు వైభవంగా జరుపుకోవాలని ప్రభుత్వం యార్న్ డిపో మంజూరు చేసిందని తెలిపారు.

నేత కార్మికులకు టెస్కో ఆధ్వర్యంలో క్రెడిట్ పై యార్న్ ను ఇవ్వడంతో పాటు ఉత్పత్తి అయిన వస్త్రాన్ని సైతం టెస్కోనే కొనుగోలు చేయనుందని తెలిపారు. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది కార్మికులకు ఎంతో లాభం కలుగుతుందని వెలిచాల రాజేందర్ రావు హర్షం వ్యక్తం చేశారు. వేములవాడ కేంద్రంగా యార్న్ డిపో మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇందుకు ప్రత్యేకంగా కృషి చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు ఎమ్మెల్యేలకు వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.