
Oplus_0
స్వర్ణోదయం ప్రతినిధి, అసిఫాబాద్: రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఉత్తర తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దుతానని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆసిఫాబాద్ పట్టణంలో పట్టబద్రుల ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా గ్రంథాలయంతో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలిపాలని కోరారు. మొదటగా పట్టణములో సాయిబాబా దేవాలయంలో బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, చౌరస్తాలోని డా. బిఆర్ అంబెడ్కర్, కొమురం భీం విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టబద్రుల సమస్యల పరిష్కారానికి ఒక సేవకుడిలా పని చేస్తానని అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ తో ఒక యాప్ ను సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ యాప్ ను 15 రోజుల్లో ప్రవేశపెడుతున్నట్టు వెల్లడించారు. తన ఎమ్మెల్సీ పరిధిలోని 4 ఉమ్మడి జిల్లాలలో తన సొంత నిధులతో ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తానని వెల్లడించారు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన ఓల్డ్ పెన్షన్ స్కీంను (OPS) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అమలు చేపిస్తానని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ న్యాయవాదులకు 5 వేలు గౌరవ వేతనం ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కృషి చేస్తానన్నారు. ఆసిఫాబాద్ లో 90 మంది టీచర్లు గెస్ట్ టీచర్లుగా పని చేస్తున్నారని వారిని (CRT) కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ లుగా గుర్తించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో పనిచేసే పార్ట్ టైం టీచర్లకు, గెస్ట్ లెక్చరర్లకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికి ఒకే జీతం అందే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్యను పరిష్కరిస్తామన్నారు. రాష్ట్రంలో మోడల్ స్కూల్, గురుకులంతో పాటు ఎయిడెడ్ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళుతున్నట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు టీచర్లు ఎస్జిటి టీచర్లకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వారిని ఈ ఎన్నికల్లో కాకుండా రాబోయే ఎన్నికల్లో అర్హులుగా గుర్తించేందుకు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తనకు వచ్చే ప్రభుత్వ వేతనాన్ని నిరుద్యోగ పట్టభద్రులకు నిరుపేద విద్యార్థులు సంక్షేమానికి ఖర్చు చేస్తానని అన్నారు. ఆసిఫాబాద్ లో ఒకే స్టడీ (ST) సెంటర్ ఉందని, రానున్న రోజుల్లో బీసీ, ఎస్సీ స్టడీ సెంటర్ లను నెలకొల్పుతామని హామీ ఇచ్చారు. జిల్లావ్యాప్తంగా ఉన్న లైబ్రరీలను సెంట్రల్ లైబ్రరీగా మార్చి నిరుపేద విద్యార్థులకు అందుబాటులో తెస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు.

