
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ మహిళలు ఆందోత్సాహల మధ్య జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకలు గురువారం రాత్రి హుజూరాబాద్ పట్టణంలో వైభవంగా జరిగాయి. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని పట్టణ శివారులోని బతుకమ్మ సౌళ్ళ వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మైదానాన్ని చదువు చేసి బతకమ్మలాడుకోవడానికి వీలుగా ఏర్పాటు చేశారు మైదానం మధ్యలో బతుకమ్మ ఎత్తుకున్న మహిళ విగ్రహాన్ని ప్రతిష్టించారు. రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడమే కాకుండా మహిళల కోసం సౌండ్ బాక్స్ లు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. బతుకమ్మ సౌల్ల వద్దకు వెళ్లడానికి పట్టణంలోని రెండు వైపుల మాత్రమే మార్గాలు ఉండడంతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. వరంగల్ రోడ్ హెచ్ పి పంపు బిఎస్సార్ గార్డెన్ ఎదురుగా నుండి గత కొన్ని ఏళ్లుగా ఉన్న రహదారిని స్థానికులు కొందరు మూసి వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రహదారి పక్కన వాహనాలను నిలిపి సౌల్ల వరకు నడుచుకుంటూ వెళ్లడానికి ప్రజలు, దివ్యాంగులు వివిధ కారణాలతో నడవలేక పోయేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ సంఖ్యలో మహిళలు, ప్రజలు రావడం నేపథ్యంలో ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు సీఐ తిరుమల గౌడ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా బతుకమ్మ సౌల్ల వద్దకు హాజరై అందరినీ పలకరించారు. ఉత్తమ బతుకమ్మ ఏర్పాటుదారులకు బహుమతులను అందజేసి మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఎత్తుగా, అందంగా పేర్చిన బతుకమ్మలకు మున్సిపల్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో బహుమతులు అందజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ బతుకమ్మ వేడుకలకు హాజరై పలువురుని పలకరించారు. ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక, వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.








