
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి బాత్రూంలో గురువారం రాత్రి లభ్యమైన నవజాత శిశువు మృతదేహం సంఘటనపై మిస్టరీ నేటికీ వీడలేదు. ఈ విషయంపై శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ జిల్లా అధికారులు దవాఖానను సందర్శించి విచారణ జరిపారు. హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఎమర్జెన్సీ వార్డు పక్కన ఉన్న బాత్రూంలో నవజాత శిశువు మృతదేహం లభ్యమయింది విధితమే. మృతదేహం ఉన్న విషయాన్ని బాత్రూం వెళ్లిన మహిళలు చూసి డ్యూటీ డాక్టర్ రమేష్ కు ఫిర్యాదు చేయడంతో ఆయన సూపర్టిండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డికి, ఆర్ఎంఓ సుధాకర్ రావులతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆసుపత్రికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి సి సి ఫుటేజ్ లను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగానే విచారణ జరుపుతున్నామని త్వరలోనే అసలు విషయం బయటపెడతామని పోలీసులు తెలుపుతుండగా.. దావఖాన సిబ్బంది హస్తముందో ఏమోనని భయాందోళనకు పలువురు గురవుతున్నారు.
–శిశువు మృతదేహం లభ్యంపై వైద్యాధికారుల విచారణ.
గురువారం రాత్రి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడంపై శుక్రవారం డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్పెటల్ సర్వీసెస్ చంద్రశేఖర్, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు, సూపర్టిండెంట్ డాక్టర్ రాజేందర్ రెడ్డి ఆసుపత్రిలోని వైద్యులను సిబ్బందిని అధికారులను విచారణ జరిపారు. వారి విచారణలో స్పష్టమైన విషయం బయటపడక పోవడంతో పోలీసులకు సిసి ఫుటేజ్ తో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమగ్ర విచారణలో నిజానిజాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
–రెండు రోజులుగా వీడని మిస్టరీ
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్డిలో నవజాత శిశువు మృతదేహం లభ్యం కావడంపై రెండు రోజులు గడిచిన మిస్టరీ విడలేదు. తమకు ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటుండగా, బయటి నుండి వచ్చి ఆసుపత్రిలో మృతదేహాన్ని వేసే అవసరం ఎవరికి ఉంటుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆసుపత్రిని బదనాం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని వైద్యులంటుండగా ఆసుపత్రిలో సరైన నిర్వహణ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు ఉండగా కొన్ని పని చేస్తుండగా మరికొన్ని పని చయడం లేదని అందుకే దీనిని ఆసరగా తీసుకొని, బయట నుండి వచ్చి ఆసుపత్రిలో మృతదేహాన్ని వేసి ఉంటారని ఆస్పత్రి వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే బయట నుండి వేస్తే వెంటనే దానిని క్షణాల్లో గుర్తించే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ మృతదేహాన్ని బయట నుండి తెచ్చి ఆసుపత్రి వాష్ రూమ్ లో వేసే ధైర్యం ఎవరికి ఉంటుంది అన్న ప్రశ్నకు జవాబు దొరకడం లేదు. ఈ వ్యవహారంలో ఆసుపత్రిలోని కొంతమంది వ్యక్తుల ప్రమేయం ఉందని బయట ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా ఆస్పత్రి నిర్వాహకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుండగా.. పోలీసుల సమగ్ర విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.







