
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 18: జిల్లాలలో గ్రూప్స్ 1, 2,3 పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలనీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ మిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎం.మహేందర్ రెడ్డి గ్రూప్స్ పరీక్షల నిర్వహణ పై అన్ని ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ 1, 2, 3 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలలో చేయాల్సిన ఏర్పాట్లకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, గ్రూప్స్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, అవసరమైన మౌలిక వసతులు పరిశీలించాలని, ఈ ప్రక్రియ నేటిలోగా పూర్తి చేయాలని కమిషన్ చైర్మన్ కలెక్టర్లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల ధృవీకరణ పూర్తయిన తర్వాత అభ్యర్థుల వివరాలతో కూడిన ఓఎంఆర్ షిట్ల ముద్రణ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. జిల్లాలో పరీక్ష ప్రశ్నా పత్రాల, ఇతర ముఖ్యమైన సామాగ్రి భద్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ లను గుర్తించాలని అన్నారు. పరీక్షలు సజావుగా సాగేందుకు వీలుగా జిల్లాలోని ఒక ప్రాంతంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు రీజనల్ కో ఆర్డినేటర్లను నియమించాలన్నారు. గ్రూప్ 3 పరీక్షకు 3 పేపర్, గ్రూప్ 2 పరీక్ష 4 పేపర్లు పెద్ద ఎత్తున అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో రీజనల్ కో ఆర్డినేటర్ పరిధిలో స్ట్రాంగ్ రూమ్ గుర్తించాలని అన్నారు. రీజనల్ కో ఆర్డినేటర్ పరిధిలో అభ్యర్థుల సంఖ్య ఆధారంగా అవసరమైన స్ట్రాంగ్ రూమ్ ఉండాలని అన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో అదనపు కలెక్టర్, పోలీస్ నోడల్ అధికారి, ఆర్డీఓ అందరూ సమన్వయం చేసుకుంటున్నారని, తెలిపారు. గ్రూప్ వన్ మెయిన్స్ జిల్లాలో 56 సెంటర్లను గుర్తించడం జరిగిందని, కరీంనగర్ జిల్లా నుండి సుమారు 27వేల 712మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు, ఇందుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేవని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో మహేశ్వర్, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.







