
–దీపావళి తర్వాత ముఖ్యమంత్రితో సమావేశం..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ జర్నలిస్టుల నివేశన స్థలాల సమస్యలను ముఖ్యమంత్రితో చర్చించి సమస్యలను పరిష్కరిస్తానని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం హుజురాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో హైదరాబాదులో ప్రెస్ అకాడమీ చైర్మన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం ఆయన నివేశన స్థలాలపై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కో- కన్వీనర్లు కాయిత రాములు, నిమ్మటూరి సాయికృష్ణలు మాట్లాడుతూ.. గత 20 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని గత ప్రభుత్వాన్ని ఒప్పించి పట్టాలు పొంది ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేశామన్నారు. కేసీ క్యాంపులో జర్నలిస్టులకు కేటాయించిన స్థలానికి ఈఎన్ సి ఇప్పించాల్సిందిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిని విజ్ఞప్తి చేశామన్నారు. దీనిపై స్పందించిన ఆయన కూడా దీపావళి అనంతరం ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారన్నారు. అనంతరం ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యుడు పోతురాజు సంపత్ ఉన్నారు.






