
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని జిల్లా ఉద్యాన మరియు పట్టు శాఖ అధికారి పి కమలాకర్ రెడ్డి రైతులకు సూచించారు. హుజురాబాద్ మండల కేంద్రంలో రైతు వేదికలో ఆయిల్ పామ్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో భాగంగా హుజురాబాద్ డివిజన్ ఉద్యాన శాఖ అధికారి బి మంజువాణి మాట్లాడుతూ ఆయిల్ పామ్ రైతులకు భావితరాల పంటగా పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేయదలుచుకున్నా రైతులకి గవర్నమెంట్ అందించే సబ్సిడీల వివరాలు క్లుప్తంగా వివరించడం జరిగింది. అలాగే ఆయిల్ ఫామ్ సాగు చేసుకోవాలనుకున్న రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు మరియు పట్టాధారు పాసుబుక్కు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరిగింది. హుజురాబాద్ మండల వ్యవసాయ అధికారి భూమిరెడ్డి మాట్లాడుతూ వరి సాగు చేసే రైతులు ఆయిల్ ఫామ్ వైపు వెళ్లాలని దీన్ని సాగు చేయడం వలన అధిక ఆదాయం పొందవచ్చు అని తాను కూడా ఒక ఆయిల్ ఫామ్ రైతునేనని రైతులందరికీ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోహియా ఎడిబుల్ ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ సిద్ధాంత లోహియా గారు మాట్లాడుతూ కరీంనగర్ మరియు జగిత్యాల ఈ రెండు జిల్లాలలో ఆయిల్ ఫామ్ నర్సరీలు ఏర్పాటు చేశామని గత 30 సంవత్సరాల నుండి పొద్దుతిరుగుడు ఆయిల్ బిజినెస్ చేయడంలో మంచి అనుభవం ఉందని తెలిపారు అలాగే ఫ్యాక్టరీ కోసం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వంత రావు పేట గ్రామంలో 30 ఎకరాలు భూమిని కొనుగోలు చేయడం జరిగిందని త్వరలోనే భూమి పూజ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ భరత్ గారు మాట్లాడుతూ సాంప్రదాయ నూనె గింజల కంటే 4 నుంచి 5 రేట్ల అధిక దిగుబడి ఉంటుందన్నారు. పంట సాగుకు అనుకూలమైన పరిస్థితులు, దిగుబడి వచ్చు విధానం, అమ్ముకునే విధానం, మార్కెటింగ్ సౌకర్యం, మొక్కకు ఇవ్వవలసిన పోషకాలు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు, గెలలు కోసే విధానం అంతర పంటలతో వచ్చే ఆదాయం గురించి క్లుప్తంగా వివరించారు. ప్రభుత్వం నుండి కల్పించిన సబ్సిడీ ని ఉపయోగించుకుని రైతులు ఈ పంటను నాటుకోవల్సిందిగా కోరారు. అలాగే ఆసక్తిగల రైతుల కోసం ఖమ్మం జిల్లాలోని అశ్వరావుపేటలో గల ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ సందర్శించడం కోసం ఒక టూర్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంపెనీ నర్సరీ మేనేజర్ హరీష్, ఫీల్డ్ ఆఫీసర్ వేణు మరియు రైతులు పాల్గొన్నారు.







