
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో డిజె సౌండ్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేదాజ్ఞలను ఈ నెల 30 వరకు పొడగించడం జరిగిందని పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలుగకుండా శబ్దకాలుష్యం నుండి కాపాడేందుకు భారీ అసౌకర్యంతో కూడిన డిజె ధ్వని వినియోగంపై నిషేదాజ్ఞలు విధించడం జరిగిందని పేర్కొన్నారు. వివిధ కార్యక్రమాల సందర్భంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డిజె సౌండ్లను వినియోగిస్తున్న విషయం విదితమే. వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ ల వినియోగం తప్పనిసరి అనిపిస్తే సంబంధిత డివిజన్ ఎసిపిల అనుమతి పొందాలని సూచించారు. ఏ ఏ ప్రాంతాల్లో ఏమేరకు ఏ స్థాయిలో మైక్ సెట్లు వినియోగించాలో పరిమితులున్నాయని, వాటికి లోబడి వినియోగించుకోవాలని, ముందస్తుగా అనుమతి పొందినట్లైతే వాటిని అనుసరించి భద్రత పరమైన సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. కమీషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు డిజెల వినియోగంపై యజమానులకు అవగాహన కల్పించడం జరిగిందని, పరిస్థితుల ప్రభావం దృష్ట్యా ఈ కాల పరిమితి పొడిగించబడే అవకాశం ఉంది. నిషేదాజ్ఞలు ఉల్లఘించే వారిపై ఐపిసి 188, హైదరాబాద్ నగర పోలీసుచట్టం, ఫసలి నిబంధనలనుసరించి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కమీషనర్ తెలియజేశారు.






