
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పోలీస్ స్టేషన్ ఎదుట శనివారం సాయంత్రం ఓ టిప్పర్ అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న పెళ్లి బృందం సభ్యుల్లో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మిగతావారు తృటిలో భారీ ప్రమాదం నుండి బయటపడ్డారు. ముందు వెళ్తున్న పెళ్లి బృందం ట్రాలీ ఆటోను వెనకాలే వస్తున్న మొరం టిప్పర్ అదుపుతప్పి వెనక ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న మానకొండూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి గాయపడగా వెంటనే బ్లూ కోల్ట్స్ సిబ్బంది సమీపంలోని ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అదే మరికొద్ది స్పీడ్ టిప్పర్ ఏక్కువగా ఉంటే ట్రాలీ ఆటోలోని సుమారు పది మందికి పెద్ద ఎత్తున ప్రమాదం జరిగేది. సరిగ్గా వారం క్రితం ఇదే ప్రాంతంలో టాక్టర్ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీ కొట్టి బోల్తా పడింది విధితమే. అయితే తాసిల్దార్ ఆఫీస్ -పోలీస్ స్టేషన్ రెండిటి మధ్యన డివైడర్ గ్యాప్ ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ఇష్టా రీతిగా వెళ్తుండడంతోనే వాహనదారులు సడెన్ బ్రేక్ వేయగా వెనకాలే వస్తున్న వాహనాలు ఢీకొంటూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. సమీప దుకాణదారులు రోడ్డుపై వాహనాలను ఇష్టం వచ్చినట్లుగా నిలిపి ఉండడం కూడా మరో కారణంగా పలువురు భావిస్తున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్టేషన్ ఎదురుగా వాహనాల పార్కింగ్ పై దృష్టి పెట్టి వాహనాలు క్రమ పద్ధతిలో వెళ్లేలా చర్యలు తీసుకుంటే ప్రమాదాలను భవిష్యత్తులో జరగకుండా అరికట్టవచ్చునని పలువురు పేర్కొన్నారు.


