
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలో శనివారం ఎమ్మెల్యే కౌశిర్రెడ్డిపై జరిగిన దాడిని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఖండించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న పాడి కౌశిన్రెడ్డిని, దళితులను ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దళితులు సూటుబూటు వేసుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ దళిత బంధు తీసుకువస్తే, దళితులను బూటుకాళ్లతో తన్నే పరిస్థితికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేరిందన్నారు. తన ముప్పై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేలపై దాడి చేయడాన్ని చూడలేదన్నారు. అంబేద్కర్ మనవడు ఈ పథకాన్ని అభినందించారని గుర్తు చేశారు. దళిత సోదరులతో కలిసి ఈ ప్రాంత ఎమ్మెల్యే అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందివ్వాలని చూస్తే పోలీసులను పెట్టి దాడి చేయించడం అమానుషమన్నారు. పది సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో ఎన్నడూ చూడనిది, పదినెల్ల పాలనలో జరగడం హేయమైన చర్య అని, ప్రజాప్రతినిధిపై దాడి చేయడమే ప్రజాపాలననా అని ప్రశ్నించారు. పోలీసులు ఎమ్మెల్యేపై చేసిన దాడిపై స్పీకర్ విచారణ జరపాలని కోరారు. శాసనసభ్యులను రక్షించాల్సిన బాధ్యత స్పీకర్ పై ఉందని గుర్తు చేశారు. నిరసన తెలపడం తెలంగాణలో నేరంగా మారిందన్నారు. ప్రజా సంఘాల నాయకులు ఖండించాలని కోరారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడుంటదని ప్రశ్నించారు. సౌత్ ఇండియాలోనే మొట్ట మొదటి సారి ఇటువంటి దాడి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో జరిగిందని అన్నారు. 5వేల పైచిలుకు మంది అకౌంట్లలో దళితబంధు నిధులు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేసి దళితులు ఆర్థికంగా అభివృద్ది చెందడానికి సాయపడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, గందె శ్రీనివాస్, మొలుగు పూర్ణచందర్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

