
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ రూరల్ డివిజన్ కి చెందిన పోలీసు అధికారులతో శనివారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి కరీంనగర్ కమీషనరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ ల యందు ఏర్పాటు చేయబడిన సీసీ కెమెరాలు పనిచేసేలా చూసుకోవాలన్నారు. వాహన తనిఖీల్లో పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ ని ఉపయోగించాలన్నారు. దీని వలన పాత నేరస్థులు పట్టుబడుటకు వీలుంటుందన్నారు. అన్ని వర్గాలకు చెందిన ప్రార్ధనా మందిరాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేలా మరియు అవి పని చేసేలా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఇతర అనేక అంశాలపై చర్చించారు.
చోరీలకు పాల్పడ్డ దొంగలను పట్టుకోవాలన్నారు. భౌతిక నేరాలు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించి వాటిని అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. మోసపూరిత నేరాలకు పాల్పడి నమోదైన కేసుల్లో గల నిందితులపై కోర్టుల్లో వెంట వెంటనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై తీసుకునే జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆక్సిడెంట్ జోన్ మరియు బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే రూరల్ డివిజన్ లో గుర్తించిన ఆక్సిడెంట్ జోన్, బ్లాక్ స్పాట్ ల వివరాలు తెలుసుకున్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో సిబ్బందిని కేటాయించాలన్నారు. డివిజన్ స్థాయిలో నమోదైన ఎస్.సి. మరియు ఎస్.టి కేసులు, పోక్సో కేసులపై సమీక్షించారు.
అక్రమ ఇసుక రవాణా, పి.డి.ఎస్. బియ్యం రవాణా, పేకాట వంటి వాటిని నివారించుటకు ఉక్కుపాదం మోపాలన్నారు. చాలా కాలం నుండి పెండింగ్ లో వున్న కేసుల వివరాలు వాటికి గల కారణాలు తెలుసుకుని వాటిని పూర్తి చేయాలన్నారు. పెండింగ్ లో గల నాన్ బైలబుల్ వారెంట్స్ ని అమలు చేయాలన్నారు. రౌడీ షీటర్లు , హిస్టరీ షీటర్ల పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెల వారికి సంబందించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలన్నారు. సమాజంలో పదే పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారితో పాటు, ప్రజలను మోసం చేసే వారిపై ఖచ్చితంగా షీట్లను తెరవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ లు శ్రీనివాస్, విజయ్ కుమార్, వెంకటరమణ, డివిజన్ కి చెందిన ఎస్.హెచ్.ఓ అధికారులైన ఇన్స్పెక్టర్లతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.






