
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారుతుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం వసతులపై హుజురాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి అక్కడి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులను, భోజన నిర్వాహకులను, ఉపాధ్యాయులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. గడిచిన వారం రోజుల నుంచి గురుకులాలతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అన్నారు. రెండు రోజుల క్రితం జమ్మికుంట కస్తూరిబా పాఠశాలలో 10 తరగతి చదువుతున్న నిత్యశ్రీ అనే విద్యార్థిని పాఠశాల నిర్లక్ష్యంతోనే మరణించిందని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్కో విద్యార్థిపై లక్ష ఇరవై ఐదు వేలు వెచ్చించి వారికి నాణ్యమైన విద్యతో పాటు భోజన సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. నాణ్యమైన భోజనం అందించడంలో విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు మొట్టికాయలు వేసిన మార్పు రావడంలేదని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కువ శాతం దళితులు, బీసీలు ఉంటారని ప్రభుత్వంపై నమ్మకంతో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పిస్తే ఇలా చేయడం ఎంతవరకు సరైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనం సరిగా లేదని హుజురాబాద్ మునిసిపల్ కమిషనర్ సమ్మయ్యకు కూడా స్వయంగా చూపించామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలపై నివేదిక తీసుకొని వెంటనే నాణ్యమైన భోజనాన్ని అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమ్ ఆడితే చూస్తూ ఊరుకోమని శ్రీనివాస్ హేచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్ చింత శ్రీనివాస్, నాయకులు భూసారపు శంకర్ తదితరులున్నారు.








