
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోవాలని మాల మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాదులో జరిగే మాల మహానాడు సింహ గర్జనకు వందలాదిగా నియోజకవర్గం నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాల మహానాడు నాయకులు హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగానే కాకుండా, దళితుల ఐక్యత కోసం మాల మహానాడు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమంటూ వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఓట్లు వేసి కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇప్పుడు మాలలకు అన్యాయం చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఇకనైనా వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకోకపోతే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాలల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. మాలల ఐక్యతతోనే ఎస్సీ వర్గీకరణకు చరమగీతం పాడాలని అన్నారు. సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం అన్యాయం అన్నారు .రాజకీయ దురుద్దేశంతోనే మాల, మాదిగలను విడదీస్తున్నారని మండిపడ్డారు. మాలలంతా ఐక్యతతో ముందుకు సాగకపోతే మనుగడ కష్టంగా మారుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వర్గీకరణపై పునరాలోచించుకోవాలని, తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు సొల్లు బాబు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొగరు స్వామి, రాష్ట్ర కార్యదర్శి పసుల స్వామి, మాల మహానాడు ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు పాక సతీశ్, భోగం దశరథం, తొగరు బుచ్చయ్య, జూపాక శ్రీనివాస్, కాయిత రాములు, వేముల పుష్పలత, సొల్లు సునీత, తోగరు బిక్షపతి, బత్తుల సమ్మన్న, కోడిగుటి ప్రవీణ్, సిరిమల రాజు, కత్తరమల సదానందం, పోతుల సంజీవ్, ఎడ్ల బక్కయ్య, ఎడ్ల భాస్కర్, నర్సింగం, పిట్ట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







