
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ డిసెంబర్ 4: పట్టణ పరిధిలోని కేసీ క్యాంపులో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అన్నం ముద్దలు ముద్దలుగా, పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించామని హుజురాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షుడు విడపు అనురాగ్, నాయకులతో కలిసి గురుకుల పాఠశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలలోని తరగతి గదులను, నిద్రించే గదులను, స్నానాల గదులను, వంటగది, భోజనశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉన్నట్టు గుర్తించారు. విద్యార్ధినీలను కలిసి భోజన సదుపాయాలు, విద్య గురించి అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి లోపాలున్న తమకు ఫోన్ చేయాలని వారు పిల్లలకు సూచించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక మాట్లాడుతూ…పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం పిల్లలకు ఇబ్బందికరంగా ఉందన్నారు. పిల్లలు తినే అన్నం ముద్దగా ఉందని, పిల్లలు తినలేక పోతున్నారని అన్నారు. ప్రభుత్వం నుండి వచ్చే బియ్యాన్ని మాత్రమే తాము వండి పెడుతున్నామని సిబ్బంది తెలిపారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పిల్లల ఆరోగ్యం దృష్ట్యా నాణ్యమైన బియ్యాన్ని పంపాలని వారు డిమాండ్ చేశారు. ముద్దముద్దగా ఉన్న భోజనం తినలేక అర్ధాకలితో ఉంటున్నారని అన్నారు. ప్రభుత్వం పంపిన బియ్యం నాసిరకంగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి వస్తుందని ఇందులో అందులో పని చేసే వారిని అనేదేముండదని వారన్నారు. గదులు కొరతగా ఉన్నందువల్ల పిల్లలకు అసౌకర్యంగా ఉందని, వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గదుల కొరతను తీర్చాలని అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టిఆర్ఎస్వి హెల్ప్ లైన్ కు ఫోన్ చేసి తెలుపాలని బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షుడు విడపు అనురాగ్ విద్యార్థులకు సూచించారు. ఈ సందర్శనలో మున్సిపల్ కౌన్సిలర్లు కేశిరెడ్డి లావణ్య, ఉజ్మా సురీన్, నాయకురాలు కొయ్యడ శ్రీదేవి, బీఆర్ఎస్వీ నాయకులు విడపు అనురాగ్, వడ్లకొండ కిరణ్, అనుదీప్, అరవింద్, విజయ్, సాయి, ఆకాష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.











